విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో పది రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ చివరికి దారుణ హత్యగా దారితీయడం కలకలం సృష్టిస్తోంది. మద్యం కోసం రూ.10 ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మరొక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఏ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
స్థానిక భీమన బాపయ్యవీధి కొండ ప్రాంతంలో తెన్నేరు పాండు జ్యోతి కుమారుడు.. 19 ఏళ్ల దుర్గాప్రసాద్ ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోజున ఇంట్లో అన్నయ్య సిగరెట్ తాగుతుండగా దుర్గాప్రసాద్ అతడిని మందలించాడు. ఈ విషయంపై కుటుంబంలో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గాప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లి చిట్టినగర్లోని ఓ బార్లో మద్యం సేవించాడు.
రూ.10 అడిగినందుకు చెంపదెబ్బ..
మరోసారి మద్యం తాగాలనే ఉద్దేశంతో దుర్గాప్రసాద్కు రూ.10 అవసరమైంది. ఈ క్రమంలో చిట్టినగర్కు చెందిన 48 ఏళ్ల పలకా తాతాజీని డబ్బు అడిగాడు. అయితే తాతాజీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, దుర్గాప్రసాద్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో యువకుడు తీవ్రంగా కోపగించాడు. దీంతో వెంటనే వేరొకరి వద్ద నుంచి డబ్బు తీసుకుని మళ్లీ మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని.. అర్ధరాత్రి సమయంలో చిట్టినగర్ సొరంగ మార్గంలోని షాపు వరండాలో నిద్రిస్తున్న తాతాజీ వద్దకు వెళ్లాడు. నిద్రలో ఉన్న తాతాజీ ఛాతీలో కత్తితో పొడిచి హత్య చేశాడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు.
